సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు అందించేలా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో ప్రజాసంకల్పయాత్రలో ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటామని వారికిచ్చిన హామీకి కట్టుబడి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఈ పధకం అమలుకు చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ పథకానికి అర్హులైనవారికి గుర్తించే విధంగా విధానాలు, ప్రణాళికను అధికారులు రూపొందించారు.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ పథకానికి ఇప్పటివరకు మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి, వాటిని పరిశీలిస్తున్న అధికారులు ఇప్పటివరకు 93,741 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. అక్టోబర్ 4న తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
[subscribe]