హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సెప్టెంబర్ 28, శనివారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ తో బుద్ధ భవన్లో భేటీ అయ్యారు. అజారుద్దీన్ తో పాటు ఎన్నికైన హెచ్సీఏప్యానల్ సభ్యులు కూడ కేటీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేసారు. క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తామని, హెచ్సీఏ కూడ తగిన విధంగా పనిచేయాలని సూచించారు. కేటీఆర్ తో భేటీ అనంతరం అజారుద్దీన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
భేటీ అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, క్రికెట్కు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరేందుకు మాత్రమే మంత్రి కేటీఆర్ను కలిశానని చెప్పారు. పార్టీల కతీతంగా అందరిని కలిసి సహకారాన్ని కోరతామని తెలిపారు. 33 జిల్లాల్లో ఉన్న యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని, తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. అయితే అజారుద్దీన్ మంత్రి కేటీఆర్ తో భేటీ అవ్వడంపై రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జి. వివేక్ కు వ్యతిరేకముగా ఉన్న అజారుద్దీన్ ప్యానెల్ కు టిఆర్ఎస్ నాయకులు పరోక్షముగా మద్ధతు ఇచ్చిన నేపథ్యంలో అజారుద్దీన్ టిఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే భేటీ అనంతరం పార్టీ మార్పుపై ఆయన ఏ విధంగా స్పందించలేదు.
[subscribe]