‘హిజాబ్’ వివాదంపై కర్ణాటక హైకోర్టు నేడు (మంగళవారం) సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. క్లాస్లో హిజాబ్ ధరించడంపై నిషేధించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు కర్ణాటక హైకోర్టులో ఐదు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు స్పష్టమైన తీర్పు వెలువరించింది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుకు ముందు, బెంగళూరులో మార్చి 15 నుండి 19 వరకు బహిరంగ ప్రదేశాల్లో అన్ని సమావేశాలు, నిరసనలు మరియు వేడుకలను నిషేదించారు. బెంగళూరుతో సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. ఈ మేరకు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక లోని ఉడిపిలో ఈ సంవత్సరం జనవరిలో ఒక ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో మొదలైన హిజాబ్ వివాదం క్రమంగా దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
కాగా, ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కాలేజీలకు చెందిన ముస్లిం బాలికలు ‘హిజాబ్’ పై పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల వాదన ప్రకారం ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం మహిళలకు హిజాబ్ తప్పనిసరి ఆచారం. అయితే, దీనిపై ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ, ఇతర న్యాయమూర్తులు కృష్ణ ఎస్ దీక్షిత్, జైబున్నీసా మొహిదీన్ ఖాజీలతో కూడిన ఫుల్ బెంచ్ విచారణ అనంతరం ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఫిబ్రవరి 10న ఒక మధ్యంతర ఉత్తర్వుల్లో ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. “ఈ పిటిషన్లన్నింటి పరిశీలన పెండింగ్లో ఉంది, వారి మతం లేదా విశ్వాసంతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ కాషాయ కండువాలు, హిజాబ్, మత జెండాలు లాంటివి ధరించకుండా మేము నిషేధిస్తున్నాము. కాలేజీ డెవలప్మెంట్ కమిటీలు విద్యార్థి దుస్తుల కోడ్/యూనిఫామ్ను నిర్దేశించిన సంస్థలకే తమ మధ్యంతర ఉత్తర్వులు పరిమితం” అని బెంచ్ మొదట్లో తెలిపింది. అయితే, పిటిషనర్లలో ఒకరి తరపున వివరణ కోరిన ధర్మాసనం, సంబంధిత అధికారులు డ్రెస్ కోడ్ను సూచించిన ప్రీ-యూనివర్శిటీ మరియు డిగ్రీ కాలేజీలకు మధ్యంతర ఉత్తర్వు వర్తిస్తుంది” అని ఫిబ్రవరి 23న స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ