జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని, ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా తనపై విమర్శలు చేశారని వ్యాఖ్యానించారు. భీమిలి నియోజకవర్గంలో ఒక్క గజం భూమి కూడా తాను ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ పవన్ నేను ఎక్కడైనా స్థలాన్ని కబ్జా చేసానని నిరూపిస్తే.. తాను వెంటనే రాజీనామా చేస్తానని మంత్రి శ్రీనివాస్ జనసేనానికి సవాల్ చేశారు. తన నియోజకవర్గంలో ఎన్నడైనా జనసేన కార్యకర్తలపై దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, వీటిపై పవన్ ఎందుకు మాట్లాడారని నిలదీశారు.
టీడీపీతో నువ్వే పొత్తు పెట్టుకున్నావు.. మళ్ళీ నువ్వే విడిపోయావు, నీలా మేము విధానాలను మార్చుకోము అని మంత్రి అవంతి తెలిపారు. నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్గా కూడా హీరోని, అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ నుంచే మొదలుపెట్టానని.. అయినాకూడా పార్టీ నుంచి బయటకు వచ్చామని, అందుకు కారణం మేము కాదని పవన్ తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు మూడు సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టేదాక వచ్చానంటే నేను సరైన దారిలో నడవటం వల్లనే అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన ప్రజలకు సత్వర ఫలితాలు ఉంటాయని, జిల్లాల వికేంద్రీకరణ కూడా అభివృద్ధి కోసమే అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ