అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ జో బైడెన్ చేత అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. 78 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి జో బైడెన్ రికార్డు సృష్టించారు. ముందుగా ఈ కార్యక్రమంలో అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ కమలా హ్యారిస్తో ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి నల్లజాతీయురాలిగా, ఆఫ్రో అమెరికన్గా, భారతీయ సంతతి వ్యక్తిగా కమలా హారిస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
ప్రమాణస్వీకారం అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రసంగం చేశారు. ఈ విజయాన్ని జరుపుకోడానికి ఏ అభ్యర్దో కారణం కాదని ప్రజాస్వామ్యమే కారణమని చెప్పారు. ఈ విజయంతో అమెరికాలో ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రబలంగా మారిందన్నారు. అమెరికాను ఏకతాటిపైకి తీసుకురావడం, ప్రజలను ఏకం చేయడం ద్వారా అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడిందని, ఇకపై కూడా సవాళ్లను అంతే సమర్ధంగా ఎదుర్కొంటుందని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారికీ, ఇవ్వని వారికాని చూడకుండా అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ జో బైడెన్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సమర్థిస్తానని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పారు. ప్రజలకు సేవ చేసే విషయంలో శక్తి గురించి కాకుండా అవకాశాల గురించి ఆలోచిస్తానని, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాకుండా ప్రజలకు మంచిచేయడం పైనే దృష్టి పెడతానని జో బైడెన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ