రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ (కఠిన ఆంక్షలు) అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సోమవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో అమలు చేయబోయే ఆంక్షలపై కర్ణాటక సీఎం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. ఈ లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతిస్తామని చెప్పారు. అలాగే రెండువారాల పాటుగా ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేయబడుతుందన్నారు. నిర్మాణ, తయారీ మరియు వ్యవసాయ రంగాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయని తెలిపారు.
ఇక కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18-44 సంవత్సరాల మధ్య ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. అర్హత ఉన్న వారందరూ ఏప్రిల్ 28 నుండి వ్యాక్సిన్ తీసుకునేందుకు నమోదు చేసుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. మరోవైపు కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 13,39,201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10,62,594 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,426 మంది మరణించారు. ప్రస్తుతం 2,62,162 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ