మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27, బుధవారం సాయంత్రం లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్, ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్దీ సేపటికే దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. రాజ్భవన్లో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిసిన ఫడ్నవిస్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ముందుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన ఎన్డీయే కూటమికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని చెప్పారు. శివసేన పార్టీకి ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా అధికారం కోసం బేరసారాలు జరిపిందని అన్నారు. శివసేన నిర్ణయం కోసం బీజేపీ ఎదురుచూసిన కూడ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోగా విపక్ష పార్టీలతో చర్చలు జరిపిందని విమర్శించారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు శివసేన విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ బీజేపీకి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాడని, అయితే చివరి నిమిషంలో కూటమిలో కొనసాగలేక రాజీనామా చేస్తానని చెప్పాడని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిపడే సంఖ్యాబలం లేక, అసెంబ్లీలో బలం నిరూపించుకోలేమని భావిస్తూ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ప్రతిపక్షనేతగా ఉండి ప్రజల పక్షాన పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధికారం కాంక్షతో ఏర్పడే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తక్కువ సమయంలోనే కూలిపోతుందని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
[subscribe]