భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టారు. 26 గంటల కౌంట్డౌన్ అనంతరం నవంబర్ 27, బుధవారం ఉదయం 9.28 గంటలకి పీఎస్ఎల్వీ-సీ47ను నింగిలోకి పంపాలని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. సోమవారం నాడు రాకెట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగానికి అంతా సిద్ధం అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రాకెట్ ద్వారా 1,625 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ప్రయోగం జరిగిన 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
ముందుగా పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ప్రయోగం మొదలైన 17.42 నిమిషాలకు 515 కిలోమీటర్ల ఎత్తులో కార్టోశాట్–3 సిరీస్కు చెందిన ఎనిమిదో ఉపగ్రహన్నీ కక్షలోకి వదులుతారు. అనంతరం అమెరికాకు చెందిన 12 ఫ్లోక్–4పీ అనే ఉపగ్రహాలు, మరియు మెష్బెడ్ అనే మరో ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్-3 ఉపగ్రహం యొక్క జీవితకాలం ఐదు సంవత్సరాలు. దేశ సైనిక సామర్థ్యాన్నీ పెంచడంతో పాటు ప్రకృతి విపత్తుల సంభవించిన సమయాల్లో కూడ కార్టోశాట్-3 సేవలు ఉపయోగపడనున్నాయి. కార్టోశాట్-3 ఉపగ్రహం తయారీకి రూ.350 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తుంది. అలాగే శ్రీహరికోటలోని ఎస్డిఎస్సి షార్ నుంచి ఇది 74 వ ప్రయోగమని ఇస్రో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ కే.శివన్ మంగళవారం నాడు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం కచ్చితంగా విజయవంతం అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు.
#ISRO #PSLV #Cartosat3
26 hours countdown for the launch of PSLV-C47 mission commenced today at 0728 Hrs (IST) from SDSC SHAR, Sriharikota.
Launch is scheduled at 0928 Hrs IST on November 27, 2019Updates will continue… pic.twitter.com/2Gva0CSy5U
— ISRO (@isro) 26 November 2019