అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం నాడు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై సభాపక్ష నేతగా ఖట్టర్ ను ఎంచుకున్నారు. ఈ సమావేశం తరువాత మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్ను కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరో వైపు జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. మొదట దుష్యంత్ చౌతాలా బదులు, ఆయన తల్లి నైనా చౌతాలాను ఆ పదవికి పరిగణిస్తున్నారని ఊహాగానాలు రాగా, చివరికి దుష్యంత్ చౌతాలానే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఖట్టర్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఖట్టర్ సీఎంగా తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 10 సీట్లు గెలిచినా జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా మద్ధతుతో హర్యానాలో బీజేపీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 25న దుష్యంత్ చౌతాలా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం, బీజేపీ పార్టీకి సీఎం పదవి, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరిందని అమిత్షా ప్రకటించారు. హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్టు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. వివాదాస్పద నేత, హర్యానా లోక్ హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్ధతు తీసుకునే ఉద్దేశం లేదని బీజేపీ పార్టీ ప్రకటించింది.
[subscribe]