అఫ్ఘనిస్థాన్లో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భారీ భూకంపం అఫ్ఘనిస్తాన్ను తాకింది. దీంతో పక్తికా ప్రావిన్స్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరియు భారీ సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘బఖ్తర్’ అధికారికంగా ప్రకటించింది. అఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో కనీసం 250 మందికి పైగా మరణించారని, మరో 150 మందికి పైగా గాయపడ్డారని సదరు వార్తాసంస్థ పేర్కొంది. తూర్పు ప్రావిన్స్లోని బర్మల్, జిరుక్, నికా మరియు కియాన్ జిల్లాల్లో భూకంపం తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. వందల కొద్దీ ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు శిథిలాల కింద నుండి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
దీనిపై స్పందించిన తాలిబాన్ ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రభావిత ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో సైనికులు హెలికాప్టర్స్ లో చేరుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమి ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తు, ఈరోజు తెల్లవారుజామున పక్తికా ప్రావిన్స్లోని నాలుగు జిల్లాలలో అనేక భూకంపాలు సంభవించాయి. వందలాది మంది మరణాలకు కారణమయ్యాయి. ఈ దుర్ఘటనలో డజన్ల కొద్దీ ఇళ్ళు ధ్వంసమయ్యాయి, పౌరులు భారీగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని తెలిపారు. కాగా తూర్పు నగరమైన ఖోస్ట్కు 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ ప్రకంపనలు 500 కి.మీలకు పైగా వ్యాపించాయని, పొరుగున ఉన్న పాకిస్తాన్, భారత్ లలో కూడా ఈ తరంగాలను గుర్తించామని మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY