హైదరాబాద్లో ఈరోజు పలు సినిమా షూటింగ్లు రద్దయ్యాయి. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 24 రంగాలకు చెందిన తెలుగు సినీ కార్మికులు మెరుపు సమ్మె చేయడంతో అనేక చిన్న, పెద్ద సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు తెలుగు చలనచిత్ర సమాఖ్య సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు తమ నిరసనను తెలుపుతూ.. నిర్మాతలు తమకు తాముగా టిక్కెట్ల రేట్లు పెంచేశారు. హీరోలు తమకు తాముగా పారితోషికం పెంచుకున్నారు. థియేటర్ల యజమానులు యధావిధిగా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. మరి సగటు సినిమా శ్రామికుల మాటేమిటి? అతని జీతం పెరిగిందా? అని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం 24 శాఖల్లోని కార్మికులకు మూడేళ్లకోసారి జీతాలు పెంచాలి. కానీ ఈసారి నాలుగేళ్లుగా జీతాలు పెంచలేదు. అదేమంటే నిర్మాతలు కరోనా మహమ్మారి సాకును చూపుతున్నారని కార్మికులు వాపోతున్నారు.
అయితే ఈ క్రమంలో సమ్మె చేసే అంశంపై ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో నిన్న కీలక చర్చ జరిగింది. సమావేశంలో వేతనాల పెంపుపై నిర్మాతల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో 24 డివిజన్లకు చెందిన కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఎన్నోసార్లు తమ బాధలను చెప్పినా ఆలకించేవారే లేరని, అందుకే నేటి నుంచి సమ్మె చేస్తున్నామని, కనీస వేతనాలు చెల్లించాలన్న తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో కృష్ణానగర్లోని సినీ కార్మికులంతా బుధవారం ఉదయం నుంచి దీనికి మద్దతు తెలుపుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్లకు వెళ్లేందుకు రెడీ అయిన జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది బస్సులు ఖాళీగా దర్శనమిచ్చాయి. మరికొన్ని బస్సులను ఫెడరేషన్ సభ్యులు అడ్డుకున్నారు. కార్మికులంతా కృష్ణానగర్లోని తమ యూనియన్ కార్యాలయాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY