ఇండోనేషియాను సోమవారం భారీ భూకంపం వణికించింది. ప్రధాన ద్వీపమైన జావాలో ఈరోజు 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన వందలకొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో కనీసం 46 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయపడ్డారు. ద్వీప ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం మూలాన ప్రమాద తీవ్రత అధికంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక దీనిపై సియాంజూర్ స్థానిక పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, పశ్చిమ జావాలోని సియాంజూర్ ప్రాంతంలో మధ్యాహ్నం భూకంపం కేంద్రీకృతమై ఉందని, అలాగే రాజధాని జకార్తా వరకు దీని ప్రభావం ఉన్నట్లు గుర్తించిందని పేర్కొన్నారు. జావాలో భూకంపం తీవత్రకు ఒక్కసారిగా ఇళ్ళు, భవనాలు కూలిపోవడంతో భయాందోళనకు గురైన నివాసితులు వీధుల్లోకి పరుగులు తీశారని, ఇప్పటికీ అనేక ప్రాంతాల నుండి బాధితులు వస్తూనే ఉన్నారని వెల్లడించారు.
ఇక ఈ ఘటనల్లో సుమారు 700 మంది వరకు గాయపడ్డారని తెలుస్తోందని, అలాగే కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉండొచ్చని, మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా హెర్మన్ తెలిపారు. ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా మరోవైపు పెద్ద ఎత్తున క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నామని, అయితే భూకంపం తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయని, దీంతో పట్టణంలోని సయాంగ్ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో బాధితులకు ఆపరేషన్ చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇక భూకంపం వలన నిర్వాసితులైన స్థానికులకు ఆహారం, నీరు అందజేస్తున్నామని, నష్ట తీవ్రతపై ఇప్పుడే అంచనాకు రాలేమని సుహెర్మాన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE