ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం (నవంబరు 22, మంగళవారం) రోజ్గార్ మేళా కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మోదీ యొక్క నిబద్ధత నెరవేర్చే దిశగా ఒక అడుగని పేర్కొన్నారు. రోజ్గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మరియు యువతకు వారి సాధికారత మరియు జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అర్ధవంతమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అక్టోబర్లో రోజ్గార్ మేళా కింద కొత్తగా చేరిన 75,000 మందికి నియామక పత్రాలు అందజేశారు. తాజాగా కొత్తగా నియమితులైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ యొక్క ఫిజికల్ కాపీలు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో (గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా) అందజేయనున్నారు. గతంలో భర్తీ చేసిన పోస్టుల కేటగిరీలతో పాటు టీచర్లు, లెక్చరర్లు, నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఇతర టెక్నికల్, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో (సీఏపీఎఫ్) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణనీయమైన సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తోంది.
మరోవైపు కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్ను కూడా రేపు ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ మాడ్యూల్ అనేది వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సు. ఇందులో ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి, కార్యాలయ నీతి మరియు సమగ్రత, మానవ వనరుల విధానాలు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు ఉంటాయని, ఇవి విధానాలకు అలవాటు పడటానికి మరియు కొత్త పాత్రలలోకి సజావుగా మారడానికి సహాయపడతాయని చెప్పారు. అలాగే వారు జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి igotkarmayogi.gov.in ప్లాట్ఫారమ్లో ఇతర కోర్సులను అన్వేషించే అవకాశాన్ని కూడా పొందుతారని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE