దేశంలో కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా పరిస్థితి, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ యొక్క సంసిద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క స్థితి మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్స్, ఇన్ఫ్లుయెంజా రకాలు, దేశంలో ప్రజలపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యంగా గత 2 వారాల్లో దేశంలో ఇన్ఫ్లుయెంజా కేసులు మరియు కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న కేసులతో సహా గ్లోబల్ కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి సమగ్ర ప్రదర్శనను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వివరించారు. 2023 మార్చి 22తో ముగిసిన వారంలో సగటు రోజువారీ కేసులు 888గా మరియు వీక్లి పాజిటివిటీ రేట్ 0.98%గా నమోదవడంతో భారతదేశం కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. అయితే, అదే వారంలో ప్రపంచవ్యాప్తంగా 1.08 లక్షల రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయని చెప్పారు. అలాగే 2022, డిసెంబర్ 22న జరిగిన చివరి కోవిడ్-19 సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను కూడా అధికారులు వివరించారు. 20 ప్రధాన కోవిడ్ డ్రగ్స్, 12 ఇతర డ్రగ్స్, 8 బఫర్ డ్రగ్స్ మరియు 1 ఇన్ఫ్లుయెంజా డ్రగ్ లభ్యత మరియు ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి సమాచారం అందించారు. 2022, డిసెంబర్ 27న 22,000 ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించబడిందని మరియు ఆ తర్వాత ఆసుపత్రులు అనేక నివారణ చర్యలు చేపట్టాయని తెలిపారు. దేశంలోని ఇన్ఫ్లుయెంజా పరిస్థితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1 మరియు హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి వివరించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, నియమించబడిన ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీలతో పాజిటివ్ శాంపిల్స్ యొక్క హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఇది కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే వాటి ట్రాకింగ్కు మరియు సకాలంలో ప్రతిస్పందనకు మద్దతు ఇస్తుందన్నారు. రోగులు, ఆరోగ్య నిపుణులు మరియు ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఆసుపత్రి ప్రాంగణంలో మాస్కులు ధరించడంతోపాటు కోవిడ్ ప్రవర్తనను అనుసరించాలని ప్రధాని నొక్కి చెప్పారు. సీనియర్ సిటిజన్లు మరియు దీర్ఘాకాల అనారోగ్యం ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలను సందర్శించినప్పుడు మాస్క్లు ధరించడం మంచిదని ప్రధాని పేర్కొన్నారు. ఐఆర్ఐ/ఎస్ఏఆర్ఐ కేసుల సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు ఇన్ఫ్లుయెంజా, కోవిడ్-19 మరియు అడెనోవైరస్లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఇన్ఫ్లుయెంజా, కోవిడ్-19 కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్ ఆరోగ్య సౌకర్యాలలో తగినంత బెడ్స్ మరియు ఆరోగ్య మానవ వనరుల లభ్యతను అందుబాటులో ఉండేలా చూడవలసిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని, దేశవ్యాప్తంగా స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ నిబంధనలతో కూడిన 5 అంచల వ్యూహంపై దృష్టి సారించడం కొనసాగించాలని, అన్ని తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) కేసుల పరీక్షలను, ల్యాబ్ నిఘా మెరుగుపరచాలని ప్రధాని సూచించారు. ఆసుపత్రులు అన్ని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మాక్ డ్రిల్స్ క్రమం తప్పకుండా నిర్వహించబడాలన్నారు. శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలని మరియు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కోవిడ్ తగిన ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్, క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా సహా పలువురు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE