ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధత, కార్యాచరణపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. కేంద్రం, రాష్ట్రాల సమిష్టి ప్రయత్నాల ద్వారా దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కొందని, రికవరీ రేటు మరియు మరణాల రేటు రెండింటిలోనూ ఇతర దేశాల కంటే భారతదేశం పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానం, ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని చెప్పారు. దేశంలో 160 కి పైగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించే ప్రక్రియ జరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు.
కరోనా మరణాల రేటును 1% కన్నా తక్కువకు తీసుకురావడమే లక్ష్యం:
కరోనా పట్ల ప్రజల ప్రతిస్పందన నాలుగు దశలుగా ఉందని ప్రధాని అన్నారు. మొదటి దశలో ప్రజలు కరోనా పట్ల భయంతో స్పందించారని, రెండవ దశలో వైరస్ గురించి సందేహాలు పెరగడంతో చాలా మంది ప్రజలు కరోనాను దాచడానికి ప్రయత్నించారని అన్నారు. ఇక మూడవ దశలో మహమ్మారిని అంగీకరించి, వైరస్ గురించి మరింత తీవ్రంగా అప్రమత్తతను ప్రదర్శించారని చెప్పారు. అయితే నాల్గవ దశలో దేశంలో పెరుగుతున్న రికవరీ రేటుతో, ప్రజలు వైరస్ నుండి కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కాగా నాల్గవ దశలో వైరస్ యొక్క తీవ్రత గురించి ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. కొన్ని దేశాలలో మాదిరిగానే ఇక్కడ కొన్నిరాష్ట్రాల్లో కూడా మళ్ళీ కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుదల కనిపిస్తోందని, ఈ సమయంలో పరిపాలనలో అలసత్వం లేకుండా మరియు జాగ్రత్తగా ఉండడం అవసరమని పేర్కొన్నారు. మరణాల రేటును 1% కన్నా తక్కువకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ సజావుగా, క్రమబద్ధంగా జరగాలి:
ఇక కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, భారతీయ డెవలపర్లు మరియు తయారీదారులతో పాటుగా గ్లోబల్ రెగ్యులేటర్లు, ఇతర దేశాల ప్రభుత్వాలు, బహుపాక్షిక సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. పౌరులకు ఇచ్చే వ్యాక్సిన్ అవసరమైన అన్ని శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటామని తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రతి ప్రాణాన్ని కాపాడటంపై దృష్టిపెట్టినట్లే, కరోనా వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరికీ చేరేలా చూడడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ సజావుగా, క్రమబద్ధంగా మరియు స్థిరంగా ఉండేలా అన్ని స్థాయిలలోని ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కోరారు. వ్యాక్సిన్ ముందుగా ఎవరికీ ఇవ్వాలనే ప్రాధాన్యతను రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయిస్తున్నట్లు ప్రధాని గుర్తించారు. అదనపు కోల్డ్ చైన్ స్టోరేజ్ల ఏర్పాటుపై కూడా రాష్ట్రాలతో చర్చించమని అన్నారు. పంపిణీ మెరుగ్గా ఉండేందుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ కోరారు. వ్యాక్సిన్ పై అపోహలు, పుకార్లు వ్యాపిస్తాయని గత అనుభవం చెప్తుందని, పౌర సమాజం, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మీడియాతో సహా అన్ని సహాయాలను తీసుకోవడం ద్వారా ప్రజల్లో వ్యాక్సిన్ పై ఎక్కువగా అవగాహన కల్పించడం ద్వారా అలాంటి ప్రయత్నాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ