అప్పటి వరకూ ఉద్యోగాలలో లేని వర్క్ ఫ్రమ్ హోమ్ను కరోనా టైమ్ పరిచయం చేసింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి ఇంట్లో నుంచే వర్క్ చేయడానికి చాలా సంస్థలు ఉద్యోగులకు అవకాశం ఇచ్చాయి. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో.. కొన్ని కంపెనీలు ఉద్యోగులనందరినీ ఆఫీసులకు రమ్మనగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం ఫ్లెక్సిబుల్ వర్కింగ్ పేరుతో వారంలో రెండు రోజులు మాత్రం ఆఫీసులకు వస్తే చాలన్న ఛాన్స్ కూడా ఇచ్చాయి.
అయితే కొన్ని నెలలుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సిటీల్లో కో వర్కింగ్ కల్చర్ పెరుగుతోంది.
స్టార్టప్ కంపెనీలే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలు కూడా కో వర్కింగ్ కోసం ఆఫీసులలో స్థలాలు వెతుకులాటలో పడుతున్నాయి. అంటే ఒకే ఆఫీసులో రెండు కంపెనీల ఉద్యోగులు కలసి పని చేయడం గురించి ఒక దగ్గర ఆఫీసు స్పేస్ చూడటం అన్నమాట. ఈ ఏడాదిలోనే ఇలా పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక ఆఫీసు ప్రత్యేకించి తమ సంస్థ కోసమే ఏర్పాటు చేసుకోవాలంటే..అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యంగా తక్కువ మందితో పనిచేసే స్టార్టప్ కంపెనీలకు నిజంగా ఇదొక పెద్ద సమస్యే. ఆఫీసులను అద్దెకు తీసుకోవడం లేదా ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం,ఆఫీసుకు అవసరమైన ఫర్నిచర్ను కొనడం, వాటి నిర్వహణ వంటి వాటికి చాలా పెట్టుబడి అవసరం. దీనిలో చాలా ఇబ్బందులూ ఉంటాయి.అందుకే దీనికి బదులుగా ‘ప్లగ్ అండ్ ప్లే’ ఆఫీసులు ఉంటేనే మంచిదనే భావన చాలాకంపెనీలో పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇలాగే కో వర్కింగ్ ప్లేసులో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
స్టార్టప్ ఫౌండర్స్ ఒకే చోట ఎక్కువ మంది ఉండటం దీనివల్ల ల వారి మధ్య నెట్వర్కింగ్ ఏర్పడటమూ కో-వర్కింగ్ ప్లేసుల గిరాకీకి కారణం అవుతోంది. పరస్పర సహకారం అవసరం పెరగడంతో.. వీటిలో ఉంటే అది సులభంగా సాధ్యం అవుతోంది. పైగా కో-వర్కింగ్ ప్లేసులలో స్టార్టప్ కంపెనీలు ఉంటే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ఆ కేంద్రాలను సందర్శించినప్పుడు.. మిగిలిన స్టార్టప్ కంపెనీల గురించి తెలిసే అవకాశాలు పెరుగుతున్నాయి. పైగా ఈ ఆఫీసులలో సీట్లను బట్టి కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ మెయింట్నెన్స్కు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే కూడా ఇక్కడ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఫ్లెక్సీ వర్కింగ్ విధానం వల్ల పెద్ద ఆఫీసులను ఏర్పాటు చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో కో వర్కింగ్ ప్లేసుల్లో 20 నుంచి 30 సీట్లను తీసుకుంటున్నాయి. కొన్ని 100కు పైగా సీట్లనూ తీసుకుంటున్న స్టార్టప్ కంపెనీలు కూడా ఉంటున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లోని కంపెనీలు.. కో వర్కింగ్ ప్లేసుల ఏర్పాటుకు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్, బెంగళూరులో దాదాపు 46 లక్షల చ.అ. విస్తీర్ణంలో కో వర్కింగ్ కేంద్రాలు ఏర్పాటయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఇలా ఆఫీసులను అద్దెకు ఇచ్చే వాళ్ల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది.