ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ లో జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎస్సీఓ సమ్మిట్కు ఎస్సీఓ సభ్య దేశాల నాయకులు, పరిశీలకుల రాష్ట్రాలు, ఎస్సీఓ సెక్రటరీ జనరల్, ఎస్సీఓ రీజినల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు మరియు ఇతర ఆహ్వానిత అతిథులు హాజరవుతారని తెలిపారు. సమ్మిట్ సందర్భంగా నాయకులు గత రెండు దశాబ్దాలుగా సంస్థ యొక్క కార్యకలాపాలను సమీక్షించాలని మరియు ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో బహుపాక్షిక సహకారం యొక్క అవకాశాల గురించి చర్చించాలని భావిస్తున్నారన్నారు. ప్రాంతీయ మరియు ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమయోచిత అంశాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు ఎస్సీఓలో ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, కిర్గిజిస్థాన్ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వంటి నేతలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY