దేశంలో కోవిడ్ పరిస్థితులు, ఒమిక్రాన్ విస్తరణపై రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తిని అరికట్టేందుకు సదా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని మోదీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ పడకలు, ఇతర మౌలిక సదుపాయాల అందుబాటును సరిచూసుకోవాలని చెప్పారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వలన ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మహమ్మారిపై పోరు అప్పుడే అయిపోలేదు. కనుక కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన నిబందనలను కొనసాగించాలి. దీనికోసం మీరందరూ రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో అవి తీసుకొనే చర్యలకు మద్దతివ్వాలి” అని పేర్కొన్నారు. జిల్లా స్థాయుల్లో వ్యవస్థలను అప్రమత్తం చేయాలని.. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కొరకై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
“మానవ వనరుల సామర్థ్యం పెంపు, శిక్షణ, అంబులెన్సుల అందుబాటు, క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ.. వీటన్నింటిపై అనునిత్యం పర్యవేక్షణ ఉండాలని ప్రధాని చెప్పారు. టెలిమెడిసిన్, టెలికన్సల్టేషన్ వంటి ఐటీ ఆధారిత వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. హాట్ స్పాట్స్, కొత్తగా కేసులు పుట్టుకొస్తున్న క్లస్టర్లపై నిఘా పెంచాలి అని సూచించారు. టీకా పంపిణీ తక్కువగా ఉన్న రాష్ట్రాలు, కేసులు పెరుగుతున్న ప్రాంతాలు.. సరైన మౌలికవసతులు లేని ప్రాంతాలకు కేంద్ర బృందాలను పంపాలి” అని మోదీ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ