దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘంగా లాక్డౌన్ విధించడంతో లోన్స్ తీసుకున్న వారికీ ఊరట కలిగించేలా మార్చి నుంచి ఆగస్టు నెల వరకు ఆరునెలల పాటుగా కేంద్రప్రభుత్వం మారటోరియం కల్పించిన విషయం తెలిసిందే. అయితే మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీతో పాటుగా ఆ వడ్డీపై మళ్ళీ వడ్డీ విధించడం వలన రుణగ్రహీతలకు ఉపయోగమేమి ఉండదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మారటోరియం పొడిగింపు, వడ్డీపై వడ్డీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఆరు నెలల మారటోరియం సమయానికి వడ్డీపై వడ్డీని మాఫీ చేసేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై మాత్రమే వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పర్సనల్, హోసింగ్, ఎడ్యుకేషన్, వెహికల్, క్రెడిట్ కార్డు బకాయిలు, ఎంఎస్ఎంఈ సంస్థలు సహా మరికొన్ని విభాగాలకు తీసుకున్న రుణాలకు ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మారటోరియంలో రుణాల వాయిదాలు చెల్లించని వారికీ గొప్ప ఊరట కలగనుంది. మరోవైపు ఈ అంశంపై వచ్చే సోమవారం నాడు సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu