దేశంలో కరోనా మహమ్మారిని పారద్రోలుతూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతూ దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దీపం వెలిగించే కార్యక్రమం వల్ల ఎలాంటి విద్యుత్ అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి ఏప్రిల్ 4, శనివారం నాడు ఒక లేఖ రాశారు.
విద్యుత్ ఉద్యోగులంతా విద్యుత్ కేంద్రాల దగ్గర విధుల్లోనే ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే దాన్ని పరిష్కరించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్ లపై ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పవర్గ్రిడ్లు కుప్పకూలతాయంటూ పుకార్లు వస్తున్నాయని, అలాంటి ప్రమాదం ఏమి లేదని, వాటికీ ఎలాంటి నష్టం లేదని కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. అలాగే ఈ కార్యక్రమలో కేవలం లైట్లు మాత్రమే ఆపమని చెప్పారని, ఇంట్లోని ప్రిజ్, ఏసీ, టీవీ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగంలో ఉంచుకోవచ్చని ప్రకటించారు. మరోవైపు అన్ని చోట్ల వీధి లైట్లు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. వీధి లైట్లు వెలగడం, ఇతర శాంతి భద్రతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలని కోరారు. అదే విధంగా ఆస్పత్రులు సహా ఇతర అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
[subscribe]