దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా 2023 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సంవత్సరానికి గానూ 3 పద్మవిభూషణ్, 4 పద్మ భూషణ్ మరియు 47 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల్లో బాలకృష్ణ జోషీ (మరణానంతరం) ఆయన కుటుంబ సభ్యులు అందుకోగా, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ ఉన్నారు. పద్మవిభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. ఇక పద్మభూషణ్ అవార్డులు అందుకున్న వారిలో కుమార మంగళం బిర్లా, సుమన్ కల్యాణ్పుర్, కపిల్ కపూర్, కమలేశ్ డి పటేల్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ముందుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 సంవత్సరానికి గాను ఆరుగురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలను కలిపి దేశంలోని పలు రాష్ట్రాల ప్రముఖులకు మొత్తం 106 పద్మ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు ఇద్దరు ఉండగా, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో మొదటి సెట్ అవార్డులు ప్రదానంలో భాగంగా బుధవారం 54 మందికి పద్మ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఇక మిగిలిన 52 మందికి మరో తేదీన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో రెండవ సెట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
2023 అవార్డుల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 12 పద్మ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికీ పద్మ భూషణ్తో పాటు ముగ్గురుకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) విభాగాల్లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆర్ట్ విభాగంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, సీవీ రాజు, కోటా సచ్చిదానంద శాస్త్రిలకు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావులకు, సోషల్ వర్క్ విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్ కు, సాహిత్యం, విద్య విభాగంలో ప్రకాశ్ చంద్రసూద్ కు పద్మశ్రీ అవార్డు వరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE