దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తూ, రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగుతుందని, జూలై 21వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు రాష్ట్రపతి ఎన్నికపై కీలక సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం వచ్చేలా ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు మరియు స్వతంత్రంగా ఉంటున్న ఇతర పార్టీలతో చర్చించే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు అప్పగిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరూ ముందుగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం వచ్చేలా కృషి చేయనున్నారు.
మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తమతో కలిసి వచ్చే భావసారూప్య పార్టీలతో చర్చించే బాధ్యతలను రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖార్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దృష్టి సారించారు. ఎన్డీఏ అభ్యర్థిపై ప్రతిపక్షాల నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఆమె
వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఆమె జూన్ 15న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశానికి హాజరుకావాలని 22 మంది విపక్ష నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అందులో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటుగా ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ఉద్ధవ్ థాకరే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా?, లేక ఎన్డీఏ, ప్రతిపక్ష అభ్యర్థులుగా ఎవరు ఉండనున్నారు? అనేదానిపై కొద్దీ రోజుల్లోనే స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY