ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా సాగుతోంది. 2023-2027 కాలానికి గాను బీసీసీఐ ఆదివారం ముంబైలో ఈ-వేలం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఉపఖండంలో టీవీ హక్కులు, డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. రిలయన్స్ కి చెందిన వయాకామ్, సోనీ నెట్ వర్క్, డిస్నీ స్టార్ మధ్య హోరాహోరిగా సాగుుతున్న వేలం ప్రక్రియలో స్టార్ టీవీ, సోనీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ప్యాకేజీ ఎ, బి హక్కులకు సోనీ నెట్వర్క్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 43 వేల కోట్లకు పైగా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే లీగ్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 105 కోట్లకు చేరినట్లయింది. ఇండియాలో టీవీ హక్కులు, ఇండియాలో డిజిటల్ రైట్స్ హక్కులు రూ. 43,255 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం ప్యాకేజీ ఎ కింద.. రూ. 24 వేల కోట్లు, ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లకు చేరగా, అలాగే ప్యాకేజీ బి కింద.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు, ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఎ,బి ప్యాకేజీలకి వేలం ముగిసిన నేపథ్యంలో.. ప్యాకేజీ సి కింద ప్లేఆఫ్స్ తో పాటు కొన్ని ప్రత్యేక మ్యాచ్ లు, ప్యాకేజీ డి కింద ఉపఖండం ఆవల ప్యాకేజీలకు వేలం జరుగనుంది. అయితే నేటి సాయంత్రంతో వేలం ముగియనుంది. దీంతో మీడియా ప్రసార హక్కుల విలువ సులువుగా రూ. 50వేల కోట్లు చేరే అవకాశముందని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ