భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎ ఈ మేరకు అయన ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) 22వ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో పాల్గొనడం కోసం ప్రధానమంత్రి గురువారం రాత్రి సమర్ఖండ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశాల మధ్య సహకారం మరింత పెరగవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం నివసిస్తోందని, ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 30 శాతం వాటా ఈ దేశాలదేనని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, తక్షణమే దీనిపై అన్ని సభ్య దేశాలు దృష్టి సారించాలని పిలునిచ్చారు.
ఈ సమస్యలను అధిగమించడానికి వైవిద్ధ్యభరితమైన సరఫరా వ్యవస్థలను ఎస్సీఓ ప్రోత్సహించాలని, దీనికోసం మెరుగైన రవాణా సదుపాయాలు అవసరమని సూచించారు. ఇండియాను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా తయారుచేయడానికి సుదీర్ఘకాల ప్రణాళికలు రూపొందించామని, దీనిలో భాగంగా భారతదేశంలో 100కు పైగా యూనికార్న్లు, 70,000కు పైగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ఇక ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో విడివిడిగా సమావేశం కానున్నారు. కాగా 2001వ సంవత్సరంలో షాంఘైలో ఏర్పాటైన ఈ ఎస్సీఓలో.. ఇండియాతో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY