శుక్రవారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, స్టార్ షట్లర్ పీవీ సింధులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నిజపాద దర్శన సేవలో పాల్గొన్న ముఖేశ్ అంబానీకి తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణాధికారి (ఈవో) ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా ఆయన వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు వచ్చారు. ఈవో ధర్మారెడ్డి స్వయంగా దగ్గరుండి అంబానీకి దర్శన ఏర్పాట్లు చేసి, అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ క్రమంలో రంగనాయకుల మండపం వద్ద ముఖేశ్ అంబానీ వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కొండపై టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న గజశాల, గోశాలలను సందర్శించారు.
ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి రావడం తనకు ఎప్పుడూ చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల కూడా దినదినాభివృద్ధి చెందుతోందని, కొండపై భక్తులకు మంచి సౌకర్యాలు అందుతున్నాయని ప్రశంసించారు. ఇక ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు కూడా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సింధుకు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం బయట పీవీ సింధు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తాను పాల్గొనబోయే అన్ని టోర్నమెంట్స్లో ఉత్తమ ప్రదర్శన చేసేలా ఆశీర్వదించమని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY