దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా నిలిపివేయబడిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించటం ద్వారా పాఠశాలలకు దూరమైన బాలబాలికలను సులభంగా తిరిగి రప్పించవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటులో జీరో అవర్ లో సోనియా గాంధీ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. మహమ్మారి కారణంగా పాఠశాలలను మూసేయడం వలన మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోయిందని, ఉపాధి కోల్పోయిన బాలల తల్లిదండ్రులు, పిల్లలకు పోషకాహారాన్ని అందివ్వలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలు తెరుబడినందున ఈ పథకాన్ని పునఃప్రారంభించి పిల్లలకు పోషకాహారాన్ని అందివ్వాలని సూచించారు.
అలాగే, మూడేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు తాజా ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని కూడా సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజనం కూడా మహమ్మారి సమయంలో మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి సహాయపడుతుంది అని చెప్పారు. సమగ్ర శిశు అభివద్ధి సేవలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 29న ప్రధాన మంత్రి పోషణ్ స్కీమ్ అమలుకు సంసిద్ధత తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న 11 లక్షల పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా బాలల్లో పోషకాహార లోపాలను అరికట్టటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ