అయోధ్య రామజన్మభూమికి సంబంధించిన కేసులో బుధవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు అక్టోబర్ 18 కల్లా ముగుస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు వాదనలను అక్టోబర్ 18 నాటికీ పూర్తిచేయనివ్వాలని కోరింది. అదే రోజు విచారణ కూడ పూర్తిచేసి కోర్టు తీర్పును రిజర్వు చేసే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17న ముగియనుంది. ఆయన పదవి విరమణ చేయకముందే తుది తీర్పును వెలువరించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ కేసులో మధ్యవర్తిత్వ పక్రియ కొనసాగించాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా ఎప్పటిలాగే గోప్యంగా ప్రయత్నాలు చేయవచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ మధ్యవర్తిత్వ పక్రియ ద్వారా ఇరువర్గాలకు సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధ్యపడితే ఆ వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించవచ్చని తెలిపారు. వచ్చే నెలరోజుల్లో యధావిధిగా కోర్టులో వాదనలు, విచారణ పక్రియ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.
[subscribe]