త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పోటీచేసే అవకాశం ఉంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజక వర్గాలతో పాటు, మరో మూడు ఇతర నియోజకవర్గాల్లో కూడ తెరాస పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు చర్చలు జరుపున్నారు. నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్ లోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన ఉద్యమ నాయకుడు, బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రికి తమ గోడు వెల్లబోసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తాము టిఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఐదు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా అమలు చేయలేని పక్షంలో మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నాం. ఈ డిమాండుతోనే ఉద్యమం చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. కేసీఆర్ అవకాశం కల్పిస్తే టిఆర్ఎస్ పార్టీ టికెట్ పైనే ఎన్నికల్లో పోటీ చేస్తాం అని వారు ప్రకటించారు. త్వరలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో కలిసి వచ్చి సీఎం కేసీఆర్ ను కలుస్తామని వారు వెల్లడించారు.
నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు, బీవండి, షోలాపూర్, రజూర తదితర ప్రాంతాల నుంచి కూడా టిఆర్ఎస్ టికెట్ కావాలని అడుగుతున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి, తమ గ్రామాల్లో కూడా అలాగే జరగాలని అక్కడి ప్రజలు కోరుకోవడం సహజమని, ఆయా గ్రామాల సమంజసమైన కోరికను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
[subscribe]