అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్ధించింది. ఈ మేరకు సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై సోమవారం తుది తీర్పును వెలువరించింది. కాగా అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నేడు తుది విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2తో ఆమోదం తెలిపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమైందని, దీనిలో ఎక్కడా రాజ్యాంగ మూలసూత్రాలను ఉల్లంఘించలేదని వారు స్పష్టం చేశారు. కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ రేపు పదవీ విరమణ చేయబోతున్న తరుణంలో నేడు ఈ కీలక అంశంపై తుది తీర్పు వెలువడటం విశేషం.
అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సీజేఐ యు.యు.లలిత్ మరియు జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. ఈడబ్ల్యూఎస్ కోటా గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50% పరిమితిని దాటుతుందనే వాదనను వీరు సమర్ధించారు. కాగా ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఉన్నత విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం రాష్ట్రాలకు వీలు కల్పించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. ప్రజలలో సామాజిక వెనుకబాటుతనం కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఈ రిజర్వేషన్లు కల్పించారు. దీనిని 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6)లను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే అదే సమయంలో వారి కుటుంబ గరిష్ట వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించి ఉండకూడదన్న నిబంధన ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE