కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అలాగే దీనిలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా వెలువడటం విదితమే. ఈ నేపథ్యంలో తనపై విధించిన రెండేళ్ల శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన స్టే పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రాహుల్ చేసిన అప్పీలును సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తిరస్కరించింది. క్రింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలని ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు. ఈ వ్యవహారంలో తొలుత ఆయన అప్పీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది.
అనంతరం అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఆర్పీ మొగేరా గత గురువారం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో నేడు తుదితీర్పును వెలువరించింది. దీంతో రాహుల్ గాంధీ తదుపరి చర్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఆయన గుజరాత్ హైకోర్టుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా ఈ కేసులో విధించబడిన రెండేళ్ల శిక్ష కారణంగా రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేసిన గుజరాత్కు చెందిన నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిలోనే రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE