లక్ష్యదీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తౌక్టే తుఫాన్ దూసుకొస్తోంది. మరో ఆరు గంటల్లో తౌక్టే తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 12 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇక మే 18, మంగళవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లి పోర్బందర్ మరియు నాలియా మధ్య గుజరాత్ లో తీరాన్ని తాకవచ్చని తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో ఈ మూడు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తౌక్టే తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని ఎన్డీఆర్ఎఫ్ డిజి సత్యప్రధాన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో 42 బృందాలను మోహరించగా, 26 బృందాలు స్టాండ్బైలో, మరో 32 అడిషనల్ రిజర్వ్ బృందాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. మత్స్యకారులు మంగళవారం వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చారు, పర్యాటక కార్యకలాపాలను కూడా నిషేదించారు. మరోవైపు ఈ తుఫాన్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఇక తుఫాన్ ప్రభావమున్న రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ