జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కు ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ నుంచి బహిష్కరిస్తునట్టు జేడీయూ ప్రకటించింది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మపై కూడా బహిష్కరణ వేటు వేశారు. వీరిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా జనవరి 29, బుధవారం నాడు జేడీయూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ, జేడీయూ పార్టీ అధ్యక్షుడు నితీశ్ కుమార్పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తుంది.
సీఏఏ, ఎన్నార్సీపై పార్టీ వైఖరితో పాటుగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశంపై నితీశ్ కుమార్ ను గత కొంతకాలంగా ప్రశాంత్ కిశోర్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ప్రశాంత్ కిశోర్ను పార్టీలోకి తీసుకున్నామని కొన్ని రోజుల క్రితం నితీశ్ కుమార్ బహిరంగంగా ప్రకటించడం, ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేయడంతో వారిద్దరిమధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ పై బహిష్కరణ వేటు వేస్తూ జేడీయూ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పార్టీ నుంచి బహిష్కరించడంపై ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేదికగా స్పందించారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మరోసారి గెలిచి బీహార్ ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవాలని అభిలాషించారు.
[subscribe]