ఇజ్రాయెల్ లోకి చొరబడి నరమేధానికి పాల్పడిన హమాస్పై.. ఆ దేశం భీకర ప్రతీకార దాడులకు దిగింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారీగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీంతో గాజా స్ట్రిప్ మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అయితే ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న భారతీయ కుటుంబం వార్త వైరల్ అవుతోంది. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోన్న ఆడియో సోషల్ మీడియాలో కనిపిస్తూ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
జమ్ము కాశ్మీర్కు చెందిన లుబ్నా నజీర్ షాబూ.. కొన్నేళ్లుగా తన భర్త, కుమార్తెతో కలిసి గాజాలోనే నివసిస్తున్నారు. హమాస్పై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ దేశం.. గాజాను అష్టదిగ్బంధనం చేయడంతో నజీర్ షాబూ కుటుంబం అక్కడే చిక్కుకుపోయింది. దీంతో షాబూ తాజాగా పీటీఐతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే తమ కుటుంబాన్ని గాజా నుంచి తరలించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
తాము అత్యంత దారుణమైన యుద్ధాన్ని చూస్తున్నామని షాబూ వివరించారు. బాంబు దాడుల్లో ఎన్నో భవనాలు క్షణాల్లో నేలకూలుతోన్నాయని.. సామాన్య పౌరులపైన కూడా ఈ దాడులు జరుగుతున్నాయని షాబూ ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ దాడికి తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కన్నీరుమున్నీరయ్యారు. పరిస్థితి చాలా భయానకంగా ఉందన్న షాబూ.. బాంబు శబ్దాలతో వణికిపోతున్నామని బాధపడ్డారు.
నీళ్లు రావట్లేదని.. కరెంట్ లేదుని.. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడికి వెళ్దామన్నా కూడా బాంబుల మోతేనంటూ .. సురక్షిత ప్రాంతమనేదే ఇక్కడ లేకుండా పోయిందని షాబూ ఆవేదన వ్యక్తం చేశారు . గాజా స్ట్రిప్ చాలా చిన్న ప్రాంతమన్న ఆమె..దీనిని అన్ని వైపుల నుంచి మూసేయడంతో.. బయటకు వెళ్లే మార్గమే లేకుండా పోయిందని నజీర్ షాబూ అధికారులకు వివరించారు.ఇప్పటికే తమకు సాయం చేయాలని.. రమల్లాలోని భారత ప్రతినిధుల కార్యాలయాన్ని తాము కోరామని, కానీ ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని షాబూ ఫిర్యాదు చేశారు.
మరోవైపు నజీర్ షాబూ ఆవేదన తమకు అర్ధం అయిందని.. భారత ప్రతినిధుల కార్యాలయం స్పందించింది. ఇది నజీర్ కుటుంబం ఒక్కదానికే సంబంధించింది కాదని.. గాజాలో చిక్కుకున్న చాలామంది భారతీయులను తరలించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది. అయితే గాజాలో ఉన్న యుద్ధ పరిస్థితులు దీనికి సహకరించడం లేదని తెలిపింది.
అటు హమాస్పై ప్రతిదాడులు చేపట్టిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. గాజాను అన్ని వైపుల నుంచి సీజ్ చేసేసింది. కరెంట్, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపేసింది. అంతేకాదు గాజాలోని హమాస్ స్థావరాలపైన వరుసగా బాంబులను జారవిడుస్తోంది. గాజా నుంచి బయటకు వెళ్లడానికి ఏకైక మార్గం రఫా క్రాసింగ్. కానీ బాంబు దాడులతో అక్కడకు వెళ్లడానికి ఉండే మార్గం మూసుకుపోయింది. దీంతో గాజాలోని సామాన్య పౌరులు, ఇతర దేశస్తులు ఆ ప్రాంతం నుంచి బయటపడలేక, అక్కడే ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ