తూర్పు ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడి, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 26న ఇండోనేషియా స్థానిక సమయమైన 8:46 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. సుమారు 300,000 మంది జనాభా ఉన్న మాలుకు రాజధాని కోటా అంబోన్లో భూకంపం బలంగా ఉందని అధికారులు తెలిపారు. పలు చోట్ల కొండ చరియలు, ఇల్లులు విరిగిపడి పడ్డాయి. భూకంపంతో కార్యాలయాలు, ఇళ్లల్లో ఉన్నవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇండోనేషియా బలమైన భూకంప విపత్తును చూడటం ఇదే మొదటిసారి కాదు, గతంలో సుమత్రాలో భూకంపం సంభవించిన తర్వాత వచ్చిన సునామీ, బండా ఆఛే అనే నగరాన్ని పూర్తిగా దెబ్బతీసి, ఇండోనేషియాలో 1,20,000 మంది మరణానికి కారణమయింది. అంతే కాకుండా 2018 లో 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపం, సులవేసిలో వచ్చిన సునామీ మరో 4,000 మందికి పైగా మరణానికి దారితీసింది. 2018 లో ఇలాంటి మరో సంఘటనలో, 7.0 తీవ్రతతో లోంబాక్లో సంభవించిన భూకంపంలో సుమారు 550 మంది మృతి చెందారు.
[subscribe]