ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను అందజేశారు.
ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు. గో ప్రదక్షిణ చేసి, గోవులకు అరటిపళ్ళు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన రూ.6 వేల రూపాయలను రాష్ట్రపతి గో మందిరం అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఏపీ రాష్ట్ర మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాత్రి తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, సివిఎస్వో నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE