హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన, హుస్సేన్సాగర్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాల వలన మొత్తం 3,480 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, అధికారులు 26 తూముల ద్వారా 3,000 పైగా క్యూసెక్కుల నీటిని మూసీ కాల్వలలోకి విడుదల చేసారు. మూసీ నది వెంబడి, నాలాల పరిసరాల్లో ఉన్న ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కవాడిగూడ, అశోక్నగర్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, కోరంటి ఆసుపత్రి, సత్యానగర్, రత్నానగర్ మీదుగా మూసి యొక్క ప్రధాన కాల్వలోకి, హుస్సేన్ సాగర్ లోకి వచ్చిన వరద నీటిని విడుదల చేశారు.
మూసీ లోకి నీటిని విడుదల చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంతో కాల్వ వెంబడి నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా నీటిని విడుదల చేయడంపై స్థానిక ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వర్ష ప్రభావం మరో 48 గంటలు ఉండడంతో, నీటి విడుదలపై తగిన విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
[subscribe]