శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నవంబర్ 28, గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్లోని శివాజీపార్క్లో జరగనున్న కార్యక్రమంలో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తిగా ఉద్ధవ్ థాకరే గుర్తింపు సాధించారు. అలాగే శాసనసభ ఉభయ సభల్లో సభ్యుడు కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జాబితాలో 8వ వ్యక్తిగా ఉద్ధవ్ చేరబోతున్నారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, రాజ్ థాకరే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని పేర్కొంటూ, ఉద్ధవ్ థాకరేకి శుభాకాంక్షలు చెబుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ) కూటమి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తోలి కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఉద్ధవ్ తో పాటుగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన తలో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
మరో వైపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న మహా వికాస్ ఆఘాడీ నాయకులు ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శివసేన శాసనసభా పక్ష నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నాయకులు జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ ఈ సమావేశంలో పాల్గొని కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేశారు. అలాగే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఆ పార్టీ నేత అజిత్ పవార్ కలుసుకున్నారు. భేటీ అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ ఈ రోజు తాను ప్రమాణం చేయట్లేదని తెలిపారు. ఇక పదవుల విషయంలో కాంగ్రెస్కు స్పీకర్ పదవి, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. కూటమి ఒప్పందంలో భాగంగా శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ 13 మంత్రి పదవులును పొందనున్నట్టు సమాచారం. అయితే ఎన్సీపీకి కేటాయించిన ఉపముఖ్యమంత్రి పదవిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
[subscribe]