2020-21 సంవత్సరానికిగానూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సుల మేరకు జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 మధ్య రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలివిడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండవ విడతలో మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని అధికారవర్గాలు పేర్కోన్నాయి.
అలాగే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2020-21 ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మందగమనంపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో రాబోయే బడ్జెట్ లో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలపై ఎక్కువుగా దృష్టిసారించే అవకాశం ఉంది. అలాగే ప్రతిపాదిత బడ్జెట్ సమావేశాల రెండు విడతల మధ్య మూడువారాలు విరామం ఉండడంతో ఆసమయంలో బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి.
[subscribe]