ఇప్పుడు ప్రతి ఒక్క పనికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి అవుతోంది. పుట్టిన పసి బిడ్డ దగ్గర నుంచి పండు ముదుసలి వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ప్రస్తుతం చిన్న పిల్లల ఆధార్ కార్డు పొందటం అంత సులభం కాదు. ప్రస్తుతం, బిడ్డ పుట్టిన తర్వాత హాస్పిటల్ లో ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, మళ్లీ దాని ద్వారా మీ సేవాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అందించే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత స్థానిక పంచాయతీ సెక్రటరీ లేదా రెవెన్యూ ఆఫీసర్ సంతకం తీసుకొని ఆధార్ సెంటర్ కు వెళ్లాలి. అక్కడ గంటల తరబడి నిరీక్షించి ఆధార్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి. ఆ సమయంలో పిల్లలు కూడా ఉండాలి. పసిబిడ్డలతో ఇలా అటు ఇటు తిరగటం కష్టంతో కూడిన పని.
అయితే ఇప్పుడు ఈ కార్డులు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ (UIDAI) ఇలాంటి సమస్యలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఒక ఆలోచన చేసింది. హాస్పిటల్లో శిశువు పుట్టిన వెంటనే వారికి ఆధార్ ఇచ్చే అవకాశం పరిశీలించనుంది. దీని కోసం బర్త్ రిజిస్ట్రార్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి యూఐడీఏఐ ప్రయత్నిస్తోంది. ఇది కనుక ఆచరణలోకి వస్తే ఇక నుంచీ పిల్లల ఆధార్ కార్డు కొరకు ఎక్కడికీ తిరగాల్సిన పని ఉండదు. హాస్పిటల్లో పుట్టిన వెంటనే ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది. ఇది అమలులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉండనుంది. నిజంగా ఇది గొప్ప ఆలోచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ