కరోనా చికిత్సలో భాగంగా ఎమర్జెన్సీ కేసులలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఇటీవల రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే రెమిడెసివిర్ కేటాయింపుల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ డిమాండ్ కంటే సరఫరా చాలా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెమిడెసివిర్ కేటాయింపులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రెమిడెసివిర్ ఉత్పత్తి ఏప్రిల్ 11, 2021న రోజుకు 33,000 వయల్స్ ఉండగా నేటికీ అది పదిరెట్లు పెరిగి రోజుకు 3,50,000 వయల్స్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. రెమిడెసివిర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను కూడా ఒక నెలలో 20 నుండి 60 కు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రెమిడెసివిర్ ఉత్పత్తి పెంపుకై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో డిమాండ్ కు మించి సరఫరా ఉండడంతో రాష్ట్రాలకు కేంద్రం నుంచి కేటాయింపులు నిలిపివేస్తున్నామన్నారు. అలాగే దేశంలో రెమిడెసివిర్ లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ ఏజెన్సీ, సిడిఎస్కోలను మంత్రి ఆదేశించారు. ఇక అత్యవసర అవసరాల కోసం వ్యూహాత్మక స్టాక్గా ఉంచేందుకు 50 లక్షల రెమిడెసివిర్ వయల్స్ ను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ