ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 10, 14, 20, 23 తేదీల్లో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, రేపు (ఫిబ్రవరి 27, ఆదివారం) ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐదో దశలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది.
సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, కౌశాంబి, ప్రయాగ్రాజ్, అయోధ్య, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా, అమేథీ మరియు రాయ్బరేలీ వంటి 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐదో దశ పోలింగ్ కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ దశలో మొత్తం 2.24 కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఇక ఈ దశలో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రులు సిద్ధార్థ్ నాథ్ సింగ్, రాజేంద్ర సింగ్, నంద్ గోపాల్ గుప్తా నాడి, రమాపతి శాస్త్రి రేపటి పోటీలో ఉన్నారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఆప్ పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యనే నెలకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ