సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020 ను అక్టోబర్ 4, 2020 న నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అక్టోబర్ 4న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సమయంలో వాయిదా వేయడం సాధ్యం కాదని విచారణ సందర్భంగా యూపీఎస్సీ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. దీంతో పరీక్షను వాయిదా వేయలేకపోవడంపై కారణాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది. అదే విధంగా ఈ అంశంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 30, బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
ముందుగా ఈ పరీక్ష మే నెలలో జరగాల్సి ఉండగా, కరోనా పరిస్థితులను వలన అక్టోబర్ కు వాయిదా పడింది. మరోవైపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు కూడా యూపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇక సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జనవరి 8, 2021 న నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu