అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 25, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్ పాల్గొన్నారు. ముందుగా ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ వద్ద ట్రంప్ త్రివిధ దళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను, భారత్ ఉన్నతాధికారులను మోదీ ట్రంప్ కు పరిచయం చేశారు. రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం తర్వాత జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించేందుకు ట్రంప్ రాజ్ఘాట్ చేరుకున్నారు.
రాజ్ఘాట్ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రాజ్ఘాట్ వద్ద సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు అక్కడి భారత ప్రతినిధులు మహాత్మాగాంధీ ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. అనంతరం రాజ్ఘాట్ ప్రాంగణంలో ట్రంప్ ఓ మొక్కను కూడా నాటారు. రాజ్ఘాట్ సందర్శన తర్వాత ట్రంప్ నేరుగా హైదరాబాద్ హౌస్కు బయల్దేరారు. హైదరాబాద్ హౌస్ లో ట్రంప్-మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
[subscribe]