ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చేపట్టిన నిరసనలు ఫిబ్రవరి 24, సోమవారం నాడు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మొదలైన అల్లర్లు, నిరసనలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో జఫ్రాబాద్, గోకుల్పురి, మౌజ్పూర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా నిరసనకారులు రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పెట్రోల్ బంకులు, ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు. అలాగే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ రాళ్ల దాడిలో రతన్లాల్ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలవడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటికి మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులతో సహా 100 మందికి పైగా గాయపడినట్టు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి, 144 సెక్షన్ విధించారు. ఢిల్లీలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్రానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఈరోజు ఈశాన్య ఢిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలతో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ను ప్రకటించారు. తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. అలాగే ఈ అల్లర్లపై ప్రత్యేక నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించినట్టుగా తెలుస్తుంది.
[subscribe]