రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మరికొన్ని ఆంక్షలతో మే 16, ఆదివారం ఉదయం 6 గంటల నుండి మే 30 న సాయంత్రం 6 గంటల వరకు 15 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ ను విధిస్తున్నట్టు శనివారం నాడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు మరియు అవసరమైన సేవల కార్యాలయాలు మినహా ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయబడతాయని చెప్పారు.
కూరగాయలు, కిరాణా, పాలు, మాంసం విక్రయించే దుకాణాలను ఉదయం 7 నుండి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించారు. అత్యవసర సేవలకు ఉపయోగించే వాహనాలకు మినహా టాక్సీలు, ఆటోరిక్షా, లోకల్ ట్రైన్ సర్వీసులు, బస్సులు వంటి ప్రజా రవాణాను నిలిపివేస్తునట్టు చెప్పారు. టీ తోటల పరిశ్రమలో 50 శాతం సిబ్బందితో పనిచేయవచ్చని తెలిపారు. వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా కాంప్లెక్సులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్లు, బ్యూటీ పార్లర్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బెంగాల్ లో ఇప్పటివరకు మొత్తం 10,94,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,50,017 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,993 మంది మరణించారు. ప్రస్తుతం 1,31,792 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ