యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8, 2022న తుదిశ్వాస విడిచినట్టుగా బర్మింగ్హమ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 11వ తేదీని (ఆదివారం) జాతీయ సంతాప దినంగా భారత్ పాటించనుంది. మరణించిన క్వీన్ ఎలిజబెత్-2 కు గౌరవ సూచకంగా, భారతదేశం అంతటా సెప్టెంబర్ 11వ తేదీన ఒక రోజు సంతాప దినం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సంతాప దినం రోజున అనగా సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగం వరకు అవనతం చేయనున్నారు. అలాగే ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ముందుగా క్వీన్ ఎలిజబెత్-2 తన తండ్రి కింగ్ జార్జ్-6 మరణం తరువాత ఫిబ్రవరి 6, 1952న తన 25 ఏళ్ల వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించింది. ఆమె 70 సంవత్సరాల 214 రోజుల పాటుగా క్వీన్ గా పాలించగా, ఏ బ్రిటీష్ చక్రవర్తి లేదా ఏ మహిళా దేశాధినేతలు కూడా ఇంత సుదీర్ఘకాలం పాలించలేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం పట్ల పలువురు ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక క్వీన్ మృతి నేపథ్యంలో ఆ దేశంలో 10 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. మరోవైపు క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ కు రాజుగా సింహాసనం అధిష్టించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY