ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఐదు ప్రాంచైజీలు/జట్లను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం విజయవంతమైన బిడ్డర్లను బీసీసీఐ ప్రకటిస్తూ, ఐదు ప్రాంచైజీల ద్వారా మొత్తం రూ.4669.99 కోట్లను సమకూర్చుకున్నట్టు తెలిపింది. కాగా 2008లో ప్రారంభ సమయంలో మెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నమోదు చేసిన బిడ్ రికార్డులను తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బద్దలు కొట్టడం విశేషం.
“ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో 5 ఫ్రాంచైజీలను స్వంతం చేసుకునే మరియు నిర్వహించే హక్కును పొందేందుకు బీసీసీఐ టెండర్కు ఆహ్వానం జారీ చేసింది. టెండర్ ప్రక్రియకు అనుగుణంగా, వివిధ ఆసక్తిగల పార్టీలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కోసం తమ బిడ్లను సమర్పించాయి. ఆసక్తిగల పార్టీల అధికార ప్రతినిధులు ఆర్థిక బిడ్లను ఈరోజు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ మరియు ఇతర ఫార్మాలిటీలు పూర్తవడంతో 5 ఫ్రాంచైజీలను అదానీ స్పోర్ట్స్లైన్, ఇండియావిన్ స్పోర్ట్స్, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్, కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థలు విజయవంతంగా దక్కించుకున్నాయని ప్రకటిస్తునందుకు సంతోషంగా ఉంది” అని బీసీసీఐ ప్రకటించింది.
బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేస్తూ “ఈరోజు క్రికెట్లో చారిత్రాత్మకమైన రోజు, ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టింది. విజేతలకు అభినందనలు. మేము మొత్తం బిడ్లో రూ.4669.99 కోట్లను సంపాదించాము. ఇది మహిళల క్రికెట్లో విప్లవానికి నాంది పలుకుతుంది మరియు మన మహిళా క్రికెటర్లకు మాత్రమే కాకుండా మొత్తం క్రీడా సహోదరుల కోసం పరివర్తనాత్మక ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల క్రికెట్లో అవసరమైన సంస్కరణలను తీసుకువస్తుంది మరియు ప్రతి వాటాదారుకు ప్రయోజనం చేకూర్చే సర్వతో కూడిన ఎకో సిస్టంను నిర్ధారిస్తుంది. బీసీసీఐ ఈ లీగ్కి – ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అని పేరు పెట్టింది. ప్రయాణం మొదలు పెడదాం” అని పేర్కొన్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఐదు జట్లు ఇవే :
- అహ్మదాబాద్ జట్టు – అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.1,289 కోట్లు
- ముంబయి జట్టు – ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.912.99 కోట్లు
- బెంగళూరు జట్టు – రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.901 కోట్లు
- ఢిల్లీ జట్టు – జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.810 కోట్లు
- లక్నో జట్టు – కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.757 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE