ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్-2021 లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలుచుకుని న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఎంతో పోరాడినా గతంలో వన్డే, టీ20 ప్రపంచ కప్ లను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. భారత్ పై ఫైనల్ లో విజయంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
ముందుగా ఐదో రోజున తోలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 249 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే(54), కెప్టెన్ కేన్ విలియమ్సన్(49) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో షమీ 4, ఇషాంత్ శర్మ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం రిజర్వ్ డే రోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 170 పరుగులకే ఆలౌటైంది. కేవలం రిషభ్ పంత్ మాత్రమే 41 పరుగులతో రాణించాడు. సౌథీ 4, బౌల్ట్ 3, జేమిసన్ 2, వాగ్నర్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుకు తోలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం ఉండడంతో, ఆ జట్టు విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్ లో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. న్యూజిలాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 139 లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టెస్టుల్లో విశ్వ విజేతగా నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(52), రాస్ టేలర్ (47) పరుగులతో రాణించగా, భారత్ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 7 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ జేమిసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మరోవైపు ఘోర పరాజయంతో భారత్ జట్టు నిరాశకు గురైంది. ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుందామనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. 2013 తర్వాత వరుసగా ఐసీసీ టోర్నమెంట్స్ లో భారత్ చివరిదశలోనే ఇంటిబాట పట్టింది. రెండేళ్ల పాటు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకొని, మరలా ఓడిపోవడంతో క్రీడాభిమానులు అసంతృప్తికి గురవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ