కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో విఫలం అయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేసారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామి ని గవర్నర్ వాజుభాయ్ వాళా కోరారు. బీజేపీ పార్టీ జాతీయ నాయకులతో రెండు రోజులు పాటు సుదీర్ఘ చర్చల తరువాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీ సిద్ధమైంది. గురువారం నాడు స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసారు,దీంతో జాప్యం చేస్తున్న బీజేపీ పార్టీ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుక్రవారం గవర్నర్ వాజుభాయ్ వాళాతో భేటీ అయ్యి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
గవర్నర్ తో చర్చల అనంతరం మీడియాతో యడ్యూరప్ప మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేసే అవకాశం ఉంది, యడ్యూరప్ప నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ప్రస్తుతం స్పీకర్ ముగ్గురిపై అనర్హత వేటు వేయడంతో సభ్యుల సంఖ్య 220 కి చేరుకుంది.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ కి 110 ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది.రాజీనామా చేసిన మిగిలిన సభ్యులపై కూడా స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకుంటే, 105 మంది ఎమ్మెల్యేలు గల బీజేపీ పార్టీ ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగుతుందా, లేక మళ్ళీ మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి.
[subscribe]
[youtube_video videoid=n3drGi2ljjg]