ప్రపంచకప్ లో పరాజయం తరువాత భారత క్రికెట్ జట్టు ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో క్రికెట్ ఆడనుంది. ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని పరిశీలకులు భావించారు,అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆడతాడా లేదా అని చెప్పకుండా, కొద్దీ రోజులు సైన్యంలో పని చేయాలనుకుంటున్నానని, వెస్టిండీస్ టూర్ కి దూరంగా ఉంటానని బోర్డుకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక లో ధోని ని భాగం చేయలేదు. సైన్యంలో పని చేయాలనుకున్న భారత్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జూలై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లో విధులు నిర్వహించనున్నాడు.
కశ్మీర్ లోయలో 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ పారా దళాలతో కలిసి ధోని పని చేయబోతున్నాడు. ఇందులో భాగంగా పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ విధులు ధోని నిర్వహించనున్నాడు. 2011 లో ధోని లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ హోదా పొందారు. ఆ తరువాత 2015 లో నెల రోజుల పాటు సైన్యంలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండి, లెఫ్టినెంట్ హోదాలో పారాచూట్ రెజిమెంట్ లో మళ్ళీ శిక్షణ తీసుకోనున్నాడు,అందుకోసం జూలై 24 న ధోని ఆర్మీ బెటాలియన్ లో చేరాడు. శిక్షణ అనంతరం 15 రోజులు విధులు నిర్వహిస్తాడు.